టెస్టులకు కోహ్లీ వీడ్కోలు తప్పదా.. కాస్త ఆలోచించమన్న బీసీసీఐ పెద్దలు

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని భావిస్తున్నాడా..? అంటే అవుననే తెలుస్తోంది. ఇంగ్లాండ్‌లో జూన్ 20 నుంచి జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు అతను తన రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లు బీసీసీఐకి చెప్పాడని విశ్వసనీయ సమాచారం. ఆ సిరీస్‌లో కోహ్లీ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉంటాడనుకునే టైంలో కోహ్లీ నుంచి వెలువడిన అభిప్రాయం బీసీసీఐ పెద్దలకు షాకిచ్చినట్లయింది. గత నెల రోజులుగా కోహ్లీ బీసీసీఐ అధికారులతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడని తెలిసింది. ఇటీవలే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీ సైతం తన నిర్ణయాన్ని బీసీసీఐకి చెప్పినట్లు తెలువగా.. మరోసారి ఆలోచించుకోవాలని పెద్దలు చెప్పినట్లు సమాచారం. ఇక కోహ్లీ తన నిర్ణయాన్ని గనుక మార్చుకోకపోతే.. 14 ఏళ్ల పాటు సాగిన అతని అద్భుతమైన టెస్ట్ కెరీర్‌కు తెరపడుతుంది. అతను కెరీర్లో 123 టెస్ట్‌లు ఆడాడు. వాటిలో 68 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు.

కొంతకాలంగా ఫామ్ లేమి

గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్‌లో కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. నవంబర్ 2024లో పెర్త్ టెస్ట్‌లో అతను సెంచరీ చేశాడు. అంతకుముందు జూలై 2023లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో సెంచరీ సాధించాడు. 2019లో పూణేలో దక్షిణాఫ్రికాపై తన అత్యధిక స్కోరు 254 నాటౌట్ చేసిన తర్వాత అతని సగటు 55.10కి చేరుకుంది. కానీ గత 24 నెలల్లో అతని సగటు 32.56 మాత్రమే ఉండడం గమనార్హం. అయినప్పటికీ జట్టు యాజమాన్యం, సెలెక్టర్లు అతని అనుభవాన్ని ఈ పర్యటనలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండగా.. అతనికి మార్గదర్శకత్వం చేయడంలో కోహ్లీ అనుభవం ఉపయోగపడుతుందని సెలెక్టర్లు భావిస్తున్నారు.

వాళ్లు కూడా లేరు

రోహిత్‌తో పాటు స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఆస్ట్రేలియాలో 2024-25 సిరీస్ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే లాంటి మిడిలార్డర్ ఉద్ధండులు జట్టులో లేరు. బౌలింగ్లో షమీ ఫామ్ ప్రశ్నార్థకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు కోహ్లీ లాంటి అనుభవ ఆటగాళ్లు జట్టులో ఉండాల్సిన అవసరముంది. మరీ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. జట్టులో లోటు స్పష్టంగా కన్పిస్తుందనేది వాస్తవం.  

భారత అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్

కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న 68 మ్యాచ్‌ల్లో భారత్ 40 గెలిచింది. కేవలం 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 40 విజయాలతో కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోనీ (60 మ్యాచ్‌ల్లో 27 విజయాలు), సౌరవ్ గంగూలీ (49 మ్యాచ్‌ల్లో 21 విజయాలు) అతని తర్వాత ఉన్నారు. టెస్ట్ విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో గ్రేమ్ స్మిత్ (109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు), రికీ పాంటింగ్ (77 మ్యాచ్‌ల్లో 48 విజయాలు), స్టీవ్ వా (57 మ్యాచ్‌ల్లో 41 విజయాలు) తర్వాత కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.

Leave a Comment