Karun Nair : టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చినందుకు గర్వంగా ఉందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రన్ అశ్విన్తో మాట్లాడిన కరుణ్.. తన కెరీర్ తొలినాళ్లలో 2016లో ఇంగ్లాండ్ మీద ట్రిపుల్ సెంచరీ చేసిన అనంతరం సరిగా సెలబ్రేట్ చేసుకోలేకపోయానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ‘ఆటగాళ్లు తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ అప్పట్లో నేను 300 చేసినా పెద్దగా సెలబ్రెట్ చేసుకోలేదు. దీనికి కారణం నా ఆనందాన్ని నా లోపలే ఉంచుకున్నానని, మరింత ఆస్వాదించాల్సిందని’ చెప్పాడు.
రంజీ ట్రోఫీలో రాణించడంతోనే..
ఇటీవల రంజీ ట్రోఫీ సీజన్లో వరుసగా సెంచరీల మీద సెంచరీలు చేసిన (Karun Nair) కరుణ్ నాయర్ మళ్లీ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో పాటు ఐపీఎల్లో ఛాన్స్ రావడంతో ముంబై ఇండియన్స్ పై గ్రేట్ ఇన్సింగ్స్ ఆడాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ను ధాటిగా ఎదుర్కొన్నాడు. దీంతో మళ్లీ అతను వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ వల్ల అతని ఆట పట్ల, అలాగే గతంలో అతని ట్రిపుల్ సెంచరీ చేయడం పట్ల మరింత ప్రచారం కలిగింది. నేటి తరం ఆటగాళ్లపై ఇంటర్వ్యూలో కరుణ్ నాయర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఈ తరం ఆటగాళ్లకు చాలా స్వేచ్ఛ ఉందని తాను ఆటలో ఎదుగుతున్నప్పుడు ఇలాంటి స్వేచ్ఛ తమకు ఉండేది కాదని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో మొదటి టెస్టుకు భారత జట్టులో కరుణ్ నాయర్కు అవకాశం లభించే వీలుంది. జట్టు అవసరాల్ని బట్టి అతను నెం.3 లేదా నెం.4 స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు.